న్యూ ఢిల్లీ, జూన్ 4, 2020: మామిడిపండ్లలో రారాజు "బంగినపల్లి", హస్తినవాసుల జిహ్వచాపల్యాన్ని తీర్చేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చి, న్యూ ఢిల్లీ లోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో కొలువైవున్నాయి. ఈ సువర్ణావకాశాన్ని హస్తినావాసులు సద్వినియోగపరచుకొని ఆంధ్రా మామిడిపండ్లను కొనుగోలు చేసి మామిడిపండ్ల రుచులను ఆస్వాదించాలని ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమీషనర్ అభయ్ త్రిపాఠి, రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా విజ్ఞప్తి చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన మామిడిపండ్లను న్యూ ఢిల్లీ లో అమ్మకం చేయుటకు ఆంధ్ర ప్రదేశ్ మార్కెఫెడ్ సౌజన్యంతో ఆంధ్ర ప్రదేశ్ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మామిడిపండ్ల అమ్మకపు కేంద్రాన్ని ఈనెల 5వ తేదీ నుంచి (శుక్రవారం) 30వ తేదీ వరకు దేశ రాజధానిలోని ప్రజలకు అందుబాటులోనికి తెస్తున్నట్లు ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన మామిడి పండ్లను దేశరాజధాని ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ మార్కెఫెడ్ సౌజన్యంతో మామిడిపండ్ల అమ్మకం కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
మామిడి పండ్లలో ప్రసిద్ధి చెందిన బంగినపల్లి మామిడిపండ్లను ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు నుంచి తెప్పించి ఈకేంద్రంలో అమ్మకం చేయుటకు సిద్ధంగా ఉంచామని, నేటి నుంచి జూన్ 30వ తేదీ వరకు ఉదయం గం. 10.00ల నుంచి సాయంత్రం గం.8.00ల వరకు అమ్మకం చేయనున్నట్లు చెప్పారు. 4 కేజీల ప్యాకింగ్ లో గల ఈమామిడిపండ్లను 450రూపాయల చొప్పున అమ్మబోతున్నట్లు తెలిపారు. ఈ సదవకాశాన్ని దేశరాజధానివాసులు సద్వినియోగపరచుకోవాలని శ్రీమతి భావన సక్సేనా సూచించారు. మామిడి పండ్ల కేంద్రం లో ఆంధ్ర ప్రదేశ్ మార్కెఫెడ్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాము (9652098760 / 8688984808) అందుబాటులో ఉంటారని ఎపి భవన్ రెసిడెంట్ కమీషనర్ భావన సక్సేనా తెలిపారు. ఈ అవకాశాన్ని హస్తినలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరారు.