spreadnews;- సచివాలయం, నవంబర్ 4 : ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, దీనిలో భాగంగా 8 వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర టూరిజం, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్) తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ఈ కాంప్లెక్స్ లు నిర్మించనున్నామన్నారు. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో 7 స్టార్, 5 స్టార్ హోటళ్ల నిర్మించనున్నామన్నారు. ఇందుకోసం బెంగుళూర్, పూణే, ఢిల్లీలో రోడ్ షో లు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
సచివాలయంలోని తన కార్యాలయంలో టూరిజం, స్పోర్ట్స్ అధికారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ లన్నీ హైదరాబాద్ లోనే ఉండేవని తెలిపారు. దీనివల్ల రాష్ట్ర విభజనతో క్రీడలకు ఆంధ్రప్రదేశ్ లో సరైన ప్రాధాన్యత కొరవడిందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో క్రీడల మౌలిక వసతుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మించనుందన్నారు.
గుంటూరు, శ్రీకాకుళం, అగనంపూడి, కొమ్మాది(విశాఖపట్నం), మొఘలపాలెం(నెల్లూరు), ఏలూరు, కాకినాడ, విజయనగరంలో పీపీపీ పద్ధతిలో ఈ కాంప్లెక్సులను నిర్మించనున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ల నిర్మాణంలో భాగంగా కొమ్మాది, అగనంపూడి (విశాఖ), పాత్రునివలస(శ్రీకాకుళం), మొఘలపాలెం (నెల్లూరు)లో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు చేపట్టనున్నామన్నారు.రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. దీనిలో భాగంగా 12 ప్రాంతాల్లో 7 స్టార్, 5 స్టార్ హోటళ్ల నిర్మించనున్నామన్నారు.
గండికోట(వైఎస్సార్ కడప), కాకినాడ, పిచుకలంక(తూర్పు గోదావరి), హార్స లీ హిల్స్(చిత్తూరు), నాగార్జున సాగర్(గుంటూరు), సూర్య లంక బీచ్(గుంటూరు), ఓర్వకల్(కర్నూల్), కళింగపట్నం(శ్రీకాకుళం), రుషికొండ(విశాఖపట్నం), భవానీ ఐల్యాండ్(కృష్ణా), తిరుపతి-పెరూర్(చిత్తూరు), పోలవరం(పశ్చిమగోదావరి) ప్రాంతాల్లో 7 స్టార్, 5 స్టార్ హోటళ్లు నిర్మించనున్నామని మంత్రి తెలిపారు. ఈ హోటళ్ల నిర్మాణానికి జాతీయ స్థాయిలో పెట్టుబడుల ఆకర్షణకు కృష్టి చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఒకట్రెండు నెలల్లో బెంగుళూరు, పూణే, ఢిల్లీలో ప్రత్యేక రోడ్ షోలు నిర్వహించనున్నామన్నారు.