spread news(న్యూఢిల్లీ); కరొనా మహమ్మారి రెండో ప్రభంజనం విజృంభిస్తుండటంతో సుప్రీంకోర్టుజైళ్లను ఖాళీ చేయడంపై దృష్టి సారించింది. ఏడేళ్ళ కన్నా తక్కువ శిక్ష విధించదగిన నేరాల్లో నిందితులను అవసరమైతే తప్ప అరెస్టు చేయరాదని పోలీసులకు తెలిపింది.ఖైదీలకు అవసరమైన సరైన వైద్య సదుపాయాలను కల్పించాలని జైళ్ళ శాఖ అధికారులను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఖైదీలకు కోవిడ్-19 సోకుతుండటంపై దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగాఆదేశాలు ఇచ్చింది.
కోవిడ్-19 సోకడానికి అవకాశం ఉన్నవారిని అత్యవసరంగా గుర్తించి గత ఏడాది పెరోల్ మంజూరు చేసినవారికి, మరోసారి 90 రోజుల సెలవును మంజూరు చేయాలని ఆదేశించింది. ఇటువంటివారికి తగిన షరతులను కూడా విధించాలని తెలిపింది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు హై లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపింది. జైళ్ళు క్రిక్కిరిసిపోకుండా చర్యలు తీసుకోవాలని,ఏడేళ్ళ కన్నా ఎక్కువ శిక్ష విధించడానికి వీలులేని ఆరోపణలను ఎదుర్కొంటున్న విచారణ ఖైదీలకు తాత్కాలిక బెయిలు మంజూరు చేయడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
ఖైదీలకు, జైలు సిబ్బందికి రెగ్యులర్గా టెస్ట్లు చేయించి, అవసరమైనవారికి చికిత్స చేయించాలని తెలిపింది. పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలని, జైళ్ళలో నిర్బంధంలో ఉన్నవారికి ఈ మహమ్మారి సోకకుండా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమయాన్ని ఆదా చేయడం కోసం ఈ ఆదేశాలు ఇస్తున్నట్లుసుప్రీంకోర్టు తెలిపింది.